దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో భారత్లో 24,850 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 613 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా నియంత్రణ కోసం సాధ్యమయ్యే అన్ని మార్గాలను అనుసరిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. ఈ క్రమంలో బెంగళూరులో 33 గంటల పాటు విధించిన లాక్డౌన్ కొనసాగుతోంది.
బెంగళూరులో ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉంది. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 21,549 కేసులు నమోదైతే.. ఇందులో ఒక్క బెంగళూరులోనే 8,345 మంది కరోనా బారినపడ్డారు. రోజులు గడిచేకొద్ది ఈ సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ప్రతీ ఆదివారం నగరంలో లాక్డౌన్ విధించడంతో పాటు.. ప్రతి రోజూ రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. లాక్డౌన్ను మరింత కఠినం చేసే దిశలో తాజాగా 33 గంటల పాటు లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
ఇతరులెవరు బయట తిరిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ వైరస్ మాత్రం అదుపులోకి రావడం లేదు. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. నిన్న రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ లాక్డౌన్.. రేపు ఉదయం 5 గంటల వరకు కొనసాగనుంది.