ప్రపంచ మహమ్మారి కరోనా దెబ్బతో మనుష్యుల్లో ఉన్న మానవత్వం మంట కలిసి పోతోంది. ఎవరికి వారు తమ సొంత వాళ్ల దగ్గరకు వెళ్లేందుకే భయపడుతోన్న పరిస్థితి. తమ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కరోనా సోకి తగ్గిందని గాంధీ హాస్పటల్ వైద్యులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తేనే వాళ్లు తమ కుటుంబ సభ్యులను తీసుకు వెళ్లడం లేదు సరికదా.. వాళ్ల నుంచి మాకు కూడా కరోనా వస్తే ఏం చేయాలని ఎదురు ప్రశ్నిస్తుండడంతో గాంధీ వైద్యులు షాక్ అవుతున్నారు. చివరకు వాళ్లకు హాస్పటల్లోనే పక్కన కొన్ని బెడ్లు వేసి చూస్తున్నారు.
ఇక ఇదే తరహాలో హైదరాబాద్లో ఎంతో మందిలో ఉన్న మానవత్వాన్ని కరోనా మహమ్మారి మంటగలుపుతున్న దృశ్యాలు మన కంట పడుతున్నాయి. కరోనా మృతుల అంతిమ సంస్కారాల్లో సిబ్బంది నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. కొన్ని మృతదేహాలను ఎవ్వరూ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఇక హైదరాబాద్ ఎర్రగడ్డ స్మశానవాటికలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మృతదేహాలను పూర్తిగా కాల్చకుండానే వదిలేస్తున్నారు. చితిమంటలు ఆరిపోయాక మృతదేహాలు సగం కాలి బయటకు కనిపిస్తున్నాయి. ఇవి అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి.