భారత్లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 24,248 మందికి కొత్తగా కరోనా సోకిందని తెలిపింది. అదే సమయంలో 425 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,97,413 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 19,693కి పెరిగింది. దేశంలో కరోనా కేసులు ఎప్పుడైతే మొదలయ్యాయో.. అప్పటి నుంచి మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.
రోజూ వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతండడంతో పాటు పోలీసులు సైతం కరోనా కాటుకు బలైపోతుండడం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 279 మంది పోలీసులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సోమవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. దీంతో మొత్తం 5454 మంది పోలీసులకు కరోనా సోకింది. అందులో 1074 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 70 మంది పోలీస్ సిబ్బంది కరోనాతో మృతి చెందారు. కాగా, దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,24,433 మంది కోలుకున్నారు.