ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తోన్న వేళ చాలా మంది ఎమ్మెల్యేలు నిబంధనలు అతిక్రమించేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన వారే నిబంధనలు తుంగలో తొక్కడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఇక ఏపీ తెలంగాణలో ఇప్పటికే 7-8 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గోవాలో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే గ్లెన్ సౌజా టిక్లో లాక్డౌన్ పార్టీకి హాజరై విమర్శలకు తెరలేపారు. కరోనా వేళ అందరూ సామాజిక దూరం తప్పకుండా పాటించాలని.. ప్రజా ప్రతినిధులు సైతం నిబంధనలు ఉల్లంఘించ కూడదని సీఎం ప్రమోద్ సావంత్ ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు.
సీఎం ఈ విషయంలో సీరియస్గా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఆ మరుసటి రోజే ఎమ్మెల్యే ఓ పార్టీకి హాజరు కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, ఎమ్మెల్యేపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ వీడియోలో కొందరు యువకులు ఓ హోటల్ గదిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యే కూడా వారితో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ 40 మంది వరకు ఉన్నారు. దీనిపై భారీ విమర్శలు రావడంతో ఎమ్మెల్యే తాను అక్కడ కొద్ది సేపు మాత్రమే ఉన్నానని.. సామాజిక దూరం పాటించానని సమర్ధించుకోవడం కొసమెరుపు.