దేశంలో కరోనా అంతకంతకు విస్తరిస్తోంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి అదుపు తప్పుతోంది. ముఖ్యంగా లాక్ డౌన్ ఎత్తేశాక పరిస్థితి పూర్తిగా అదుపు తప్పేసింది. లాక్ డౌన్ ఎత్తేశాక రోజుకు సగటున కేసులు 20 వేలు దాటేస్తున్నాయి. ఇవి ఇప్పుడు ఏకంగా 25 వేలకు చేరువ అవుతున్నాయి. అంటే నాలుగు రోజుల్లోనే దేశంలో లక్ష కొత్త కేసులు అధికారికంగా వచ్చేస్తున్నాయి. తెలంగాణ లాంటి చోట్ల పరీక్షలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పరీక్షలు చేస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువుగా 30-40 వేలు దాటేసినా ఆశ్చర్య పోనక్కర్లేదని అంటున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానానికి చేరింది. త్వరలోనే రెండో స్థానాన్ని ఆక్రమించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో 30 లక్షల కేసులు నమోదు అయ్యాయి. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్లో 16లక్షలు దాటాయి. ఇక ఇప్పటికే మన దేశంలో కేసులు 7 లక్షలు ఉన్నాయి. మరో నెల రోజుల్లో ఇదే జోరు కొనసాగితే మన దేశం బ్రెజిల్ను దాటేసి రెండో స్థానంలోకి వెళ్లిపోనుందని పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లోనే భారత్లో 24వేల 248 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో 19వేల 693 మంది మరణించారు.