దేశంలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. మొన్నటి వరకు వందల సంఖ్యలో కేసులు నమోదు అయితే.. లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి వేల సంఖ్యకు ఎగబాకాయి. భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 22,252 కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 467 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరుకున్నది. దీంట్లో 2,59,557 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 4,39,948 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 20,160గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక ఒడిశా రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా అక్కడ 571 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం తెలియజేసింది. 6,486 మంది కరోనాతో కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 42 మంది కరోనాతో మరణించినట్లు పేర్కొన్నారు. అక్కడ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,097కు చేరగా అందులో 3,557 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.