చైనాకు ప్రపంచ వ్యాప్తంగా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే భారత్తో చైనా సరిహద్దులో దాడుల నేపథ్యంలో మన దేశంలో 59 చైనా యాప్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో చైనాకు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. ఇక తాజాగా భారత్లో నిషేధానికి గురైన టిక్టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్కు దాదాపు 6 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని సమాచారం. భారత్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థలకు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కూడా లేవు.
ఇక ఇప్పుడు టిక్ టాక్కు మరో షాక్ తగిలింది. టిక్టాక్ హాంకాంగ్ మార్కెట్ నుంచి వైదొలగనున్నట్లు మంగళవారం ప్రకటించింది. అయితే దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని కాలరాస్తూ చైనా పార్లమెంటు ఇటీవలే జాతీయ భద్రతా చట్టానికి ఆమెదం తెలిపింది. దీంతో అక్కడ నిరసనలు భగ్గుమన్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు చైనా తీరును ఎండగడుతూ ఒకే తాటిపైకి వస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అక్కడ టిక్ టాక్ను ఆపేశారు. దీంతో టిక్ టాక్ ఏకంగా 1.50 లక్షల యూజర్లను కోల్పోయింది.