దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఇప్పుడు టీడీపీ కంచుకోటల్లో కూడా వెలుస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చోట్ల వైఎస్సార్ విగ్రహాలు పెట్టనివ్వలేదు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో వైసీపీకి చెందిన వారు తమ పార్టీ ఓడిన నిరుత్సాహంలో వైఎస్సార్ విగ్రహాలు పెట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీ ఏకంగా 151 సీట్ల భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో టీడీపీ కంచుకోటలు, వైసీపీకి పట్టులేని గ్రామాల్లో కూడా వైఎస్సార్ విగ్రహాలు పెడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస టీడీపీకి కంచుకోట. ప్రస్తుత ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం ఇక్కడ టీడీపీ నుంచి వరుస విజయాలు సాధించారు. ఆ తర్వాత ఆయన మేనల్లుడు కూన రవికుమార్ కూడా ఇక్కడ టీడీపీ నుంచి గెలిచారు. ఇక గత ఎన్నికల్లో తమ్మినేని ఇక్కడ దాదాపు 20 ఏళ్ల తర్వాత గెలిచారు. దీంతో ఆయన ఆధ్వర్యంలో ఆముదాలవలసలో ఏకంగా పది అడుగుల వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ జయంతి వేళ ఈ విగ్రహాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభిస్తారు. ఈ విగ్రహాన్ని గుంటూరు కి చెందిన శిల్పులు తీర్చిదిద్దారు. మొత్తం 450 కిలోల కంచును ఈ విగ్రహానికి ఉపయోగించారు.