చిత్ర పరిశ్రమకు త్వరలో తీపి కబురు అందనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన షూటింగ్‌లను పునఃప్రారంభించుకునేందుకు అవసరమైన మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వెల్లడించారు. దీని ద్వారా సీరియల్‌, రియాలిటీ షోస్‌, కో ప్రొడక్షన్‌, యానిమేషన్‌, గేమింగ్‌ తదితర రంగాల్లో పని చేసే పలువురు లబ్ధి పొందనున్నారు. ముంబయిలో నిర్వహించిన 'ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్ ఇండస్ట్రీ' (ఫిక్కీ) 21వ వార్షిక సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. సినిమా, టీవీ, గేమింగ్‌ తదితర విభాగాలకు వేర్వేరు మార్గదర్శకాలను విడుదల చేస్తామన్నారు. 

 


సృజనాత్మక రంగంలో భారత్‌ దూసుకుపోతోందని, ఇక్కడ చిత్రీకరించిన సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో వీక్షిస్తున్నారని అన్నారు.ఈ రంగంలో వ్యాపారవేత్తలు మరిన్ని పెట్టుబడులు పెట్టి చిత్ర పరిశ్రమను మరింత ముందుకు తీసుకుపోవాలని కోరారు. సాధారణంగా ఈ సమావేశాలను ముంబయిలోని పొవాయ్‌ సరస్సు ప్రాంతంలో నిర్వహిస్తుంటారు.కానీ, కరోనా నేపథ్యంలో ఈసారి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కొనసాగిస్తున్నారు. ఈ నెల 11 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.


ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. భారతదేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడంతో సృజనాత్మక పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. మీడియా, వినోద పరిశ్రమ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని సమాచార శాఖ కార్యదర్శి అమిత్‌ ఖరే తెలిపారు. తాజాగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో సినిమా రంగానికి మళ్లీ మంచి రోజులొస్తున్నాయనే చెప్పాలి. దాదాపు మూడు నెలలుగా ఆగిపోయిన చిత్రీకరణలు, నిర్మాణాంతర కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తక్కువ మందితోనే చిత్రీకరణ నిర్వహించుకునే కేంద్రం వెసులుబాటు కల్పించే అవకాశముంది. మరోవైపు కేంద్రం లాక్‌డౌన్‌ను వివిధ దశల్లో సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: