సమాజంలో రోజు రోజుకు మనుష్యుల్లో మానవత్వం మరిచిపోతున్నారు. నడి రోడ్డుపై సాటి మనిషి ప్రాణం పోతున్నా కూడా... విలవిలా కొట్టుకుంటున్నా కూడా కనీసం సాయం చేసేందుకు ఎవ్వరూ కూడా ముందుకు రాని పరిస్థితి. తాజాగా హైదరాబాద్లోని ఈసీఐఎల్ చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు రోడ్డుపై కుప్ప కూలి విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ యువకుడిని కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పరిస్థితి విషమించడంతో పెద్దాసుపత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు. 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించేయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. వారు అతడు చనిపోయినట్టు నిర్దారించారు. యువకుడి వెంటే ఉన్న అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.మృతుడు జవహర్ నగర్ కు చెందిన పృథ్వీరాజ్గా తెలిసింది.
ఓ వైపు యువకుడు రోడ్డు మీద కుప్ప కూలిపోగా.. అతడి కుటుంబ సభ్యులు రోదిస్తుంటే కరోనా పరిస్థితుల నేపథ్యంలో కిందిపడిన యువకుడికి, అతనికి కుటుంబ సభ్యులకు సాయం చేసేందుకు ఎవరూ సాహసించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.