భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 22,752 మందికి కొత్తగా కరోనా సోకిందని తెలిపింది. అదే సమయంలో 482 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,42,417 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 20,642కి పెరిగింది. 2,64,944 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,56,831 మంది కోలుకున్నారు. ఇటీవల లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కేసులు మరింత పెరిగిపోతున్నాయని అంటున్నారు.
తాజాగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ మద్య ఇక్కడ పాజిటివ్ కేసులు అధికమవుతున్నాయి. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి కరోనా వ్యాపించింది. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం రాజ్ నివాస్ లోని పీఆర్వో ఆఫీసులో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు బుధవారం వైద్యాధికారులు వెల్లడించారు. కరోనా పాజిటీవ్ కేసు నిర్ధారణ కాగానే.. ఎల్జీ ఆఫీసు సిబ్బంది అప్రమత్తమైంది.
48 గంటల పాటు కార్యాలయాన్ని మూసివేసి శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. పీఆర్వోలో పని చేసే ఉద్యోగులతో పాటు మిగతా సిబ్బంది హోంక్వారంటైన్ లో ఉండాలని ఎల్జీ ఆఫీసు సూచించింది. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వ్యక్తిగత సిబ్బందితో పాటు మిగతా వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.