దేశంలో మార్చి నుంచి కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కరోనా కేసులు ఓ మోస్తారులో పెరుగుతూ వచ్చాయి. ఎప్పుడైతే లాక్ డౌన్ సడలించడం.. వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లడం చేయడంతో కరోనా కేసులు మళ్లీ విజృంభించాయి. ఒకే రోజు దాదాపు 25 వేల కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది... కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో అత్యధికంగా 24,879 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనాబారిన పడి 487 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 21,129కు పెరిగింది.. కరోనా బారినపడి ప్రస్తుతం 2,69,789 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇక, కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4,76,378కు చేరింది.