ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య ప్రస్తుతం వాతావరణం ఉప్పు నిప్పుగా ఉంది. ఏ చిన్న విషయం జరిగినా విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రంగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీడీపీకి చెందిన మాజీ మంత్రులు అరెస్టు కావడంతో విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రంగా నడుస్తున్నాయి. వాతావరణం ఇంత హాట్ హాట్గా ఉంటే తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం సీతానగరంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలు తొలగించడంతో రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
వాస్తవానికి ఈ విగ్రహాన్ని రెండు సంవత్సరాల క్రితం పంచాయతీ తీర్మానంతో గ్రామంలో ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఈ విగ్రహాన్ని తొలగించారు. దీంతో ఆ గ్రామంతో ఎన్టీఆర్ విగ్రహం తొలగించారన్న వార్తలు జిల్లా అంతటా వ్యాపించడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. విగ్రహాన్ని తొలగించిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.