క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తన 71వ పుట్టినరోజు సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 35 మంది చిన్నపిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్స చేయించాలని సంకల్పించారు. ముంబయిలోని శ్రీ సత్య సాయి సంజీవని చైల్డ్ కేర్ హాస్పిటల్లో.. చికిత్స చేయించేందుకు తమ తల్లిదండ్రులకు స్తోమత లేని పిల్లలకు అండగా నిలవనున్నారు. టీమ్ఇండియా తరఫున తాను 35సెంచరీలు సాధించినందున.. అంత మంది పిల్లలకు చికిత్స అందించాలని నిర్ణయించుకున్నారు.
సేవ చేసేందుకు ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. కానీ పిల్లలకు ప్రత్యేక స్థానం ఉంది. వారు ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది. బంగారు భవిష్యత్తు ఉన్న పసికందులు వాళ్లు. దురదృష్టం కొద్దీ.. భారత్లో హృద్రోగ సమస్యలు అధికం. చాలా మంది బతికే అవకాశాలు తక్కువ. ముఖ్యంగా పేదవాళ్లు.. మన దేశంలో వైద్య సదుపాయాలూ పరిమితంగానే ఉన్నాయి. అందుకే 'హార్ట్ టు హార్ట్' ఫౌండేషన్ ద్వారా.. కొంత మంది పిల్లల ప్రాణాలు కాపాడాలని నిశ్చయించుకున్నా. ఈ చికిత్స పూర్తిగా ఉచితం." అంటూ గావస్కర్ వెల్లడించారు.