కేరళలో రాజకీయ చర్చలు రేపిన 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కుంభకోణం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది . ముఖ్యంగా ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్తో పాటు సందీప్ నాయర్,ఫజిల్ ఫరీద్, సరిత్ పై చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం కింద అభియోగాలు మోపింది.రూ.14.8 కోట్లు విలువైన బంగారం స్మగ్లింగ్ కేసును ఎన్ఐఏకు బదిలీ చేసింది కేంద్ర హోంశాఖ.
ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కేరళ హైకోర్టును స్వప్న ఆన్లైన్ ద్వారా ఆశ్రయించింది . ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును ఎన్ఐఏ శుక్రవారం కోరింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ) కింద కేసు నమోదైనట్లు పేర్కొంది. బంగారం స్మగ్లింగ్లో ఆమె పాత్ర గురించి తెలియాలంటే విచారించేందుకు రిమాండ్కు తరలించాల్సిన అవసరముందని న్యాయస్థానానికి వివరించింది.ఈ కేసుతో స్వప్నకు సంబంధముందని రుజువు చేసేందుకు మరో నిందితుడు సరిత్, సందీప్ నాయర్ భార్య వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు కేంద్రం తరఫు న్యాయవాది.వాదనలు విన్న అనంతరం ఈ కేసులో అరెస్టు నుంచి స్వప్నకు మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరించారు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ మేనన్.