కరోనా భయంతో ఓ వైపు ఆక్సిజన్ సిలిండర్లు లేక చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఇదిలా ఉంటే దీనిని క్యాష్ చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ సిలిండర్ల దందాకు తెరలేపారు. అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతూ రు. లక్షలు
దండుకుంటున్నారు. దీనిపై పక్కా సమాచారంతో వెస్ట్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఆ ముఠాను అరెస్టు చేశారు.
అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతున్న రెండు ముఠాలపై దాడి చేసిన పోలీసులు 34 ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు గత కొద్ది రోజులుగా పలు ప్రైవేటు ఆసుపత్రులకు, మరి కొందరు వ్యక్తులకు ఈ సిలిండర్లు అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్క సిలిండర్ కు రు. లక్ష వరకు వసూళ్లు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న సిలిండర్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు అప్పగించారు. అనుమతులు లేకుండా సిలిండర్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.