జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా వైర్లెస్ టెక్నాలజీ దిగ్గజం క్వాల్కామ్ సంస్థ.. జియో ప్లాట్ఫామ్స్లో 0.15 శాతం వాటాను రూ. 730 కోట్లకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.
ఇప్పటి వరకు జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో క్వాల్కామ్ 13వ సంస్థ. తాజా పెట్టుబడితో జియోకు గత ఏప్రిల్ నుంచి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.1,18,318.45 కోట్లకు చేరాయి.ఈ పెట్టుబడుల కారణంగా క్వాల్కామ్తో ఏర్పడిన బంధం.. జియో అధునాతన 5జీ సేవలకు ఉపయోగ పడుతుందని తెలిపింది సంస్థ.
2021 వరకు సంస్థను రుణరహితంగా మార్చాలని రిలయన్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జియో వరుస పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందుకోసం జియోలో 25 శాతం మైనారిటీ వాటాను వాటాదార్లకు విక్రయించాలని నిర్ణయించింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో... జియోలో వాటా విక్రయాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది.రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో జియో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. భారత్ మార్కెట్లో 38.8 కోట్ల మంది చందాదారులతో జియో అగ్రస్థానంలో కొనసాగుతోంది.