రాజస్థాన్​లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైన అనిశ్చితి నేపథ్యంలో సోమవారం సీఎల్పీ భేటీ నిర్వహించనుంది పార్టీ. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నివాసంలో ఈరోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ఉంటుందని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్​ఛార్జి అవినాశ్ పాండే స్పష్టం చేశారు.ఈ భేటీ తర్వాత పార్టీ సీనియర్ నేతలు రణ్​దీప్ సుర్జేవాలా, అజయ్​ మాకెన్ సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని పార్టీ విప్ జారీ చేసింది. భేటీకి హాజరుకానివారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

 


రాజస్థాన్​లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని పాండే తెలిపారు. తమకు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేశారు. అశోక్ గహ్లోత్​తో ఫోన్​లో మాట్లాడిన మరో నలుగురు ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇస్తామని ప్రకటించినట్లు వెల్లడించారు.రాజస్థాన్​లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సీఎం గహ్లోత్​పై తిరుగుబాటు బావుటా ఎగరేశారు ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను తీసుకుని క్యాంప్ రాజకీయాలకు తెర తీశారు. పైలట్​కు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తుండగా 200 స్థానాలు గల రాజస్థాన్ అసెంబ్లీలో గహ్లోత్ గట్టెక్కుతారా అనే అంశమై సందిగ్ధం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: