ఏపీలో అధికార వైసీపీలో కరోనా కలకలం రేగింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ వేడుకల్లో పాల్గొన్న నేతల్లో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వేడుకల్లో పాల్గొన్న వారు అందరూ ఇప్పుడు పరీక్షలు చేయించుకుంటున్నారు. వీరికి కూడా కరోనా పాజిటివ్ వస్తుండడంతో ఈ వేడుకల్లో పాల్గొన్న వారిలో అసలు ఎంత మందికి కరోనా వచ్చిందా ? అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఆముదాలవలసలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి కృష్ణదాస్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దీనికి సారథ్యం వహించిన శ్రీకాకుళానికి చెందిన ఓ వైద్యుడిలో కరోనా లక్షణాలు వెలుగు చూడటంతో వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 40 మందికి పరీక్షలు జరిపిన అధికారులు మొత్తం 40 మందిని క్వారంటైన్కు తరలించారు. తమ్మినేని, మంత్రి ధర్మాన సహా వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు జరపగా నెగెటివ్ వచ్చినట్లు సమాచారం.
ఇక గుంటూరులో నెహ్రూ నగర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 25 మందికి పాజిటివ్ రాగా.. ఇదే జిల్లాలో ప్రత్తిపాడులో కూడా కార్యక్రమంలో పాల్గొన్న కొందరు యువనేతలకు పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ స్టార్ట్ అయ్యింది.