ఏపీలో ప్రకాశం జిల్లాను కరోనా కేసులు ఘోరంగా వణికిస్తున్నాయి. వాస్తవానికి ఏపీలో కరోనా ఎంటర్ అయినప్పటి నుంచే ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు తీవ్రమవుతూ వచ్చాయి. ఒకానొక టైంలో కరోనా జిల్లాలో కర్నూలు జిల్లాతో పోటీపడుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం జిల్లాలో రోజుకు అన్ని ప్రాంతాల్లోనూ కేసులు నమోదు అవుతుండడంతో సగటున వీటి సంఖ్య 100కు చేరువ అయ్యింది. జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు మార్కాపురం, యర్రగొండపాలెం, చీరాల, గిద్దలూరు, కనిగిరి ప్రాంతాల్లో కరోనా వైరస్ తీవ్రంగా ఉంది.
జిల్లా కేంద్రమైన ఒంగోలులో చాలా చోట్ల రెడ్ జోన్లు ఉండడంతో కలెక్టర్ భాస్కర్ లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు 1807కు చేరుకున్నాయి. ఇప్పటికే 16 మంది మృతి చెందారు. రోజు రోజుకు జిల్లాలో కేసులు పెరుగుతుండడంతో పాటు రెడ్జోన్లు పెరుగుతుండడంతో ప్రభుత్వం మరింత తీవ్రంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. వ్యాపారులు కలెక్టర్ భాస్కర్కు కాస్త మినహాయింపు ఇవ్వాలని కోరినా ఆయన ఎంత మాత్రం తగ్గేది లేదని చెప్పారు.