వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఎలాగైనా బెయిల్ ఇప్పించాలని ఆయన తరఫు న్యాయవాదులు నానా తంటాలు పడుతున్నారు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.14,000 కోట్ల మోసంలో వజ్రాల వ్యాపారి నీరవ్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. నీరవ్ మేనమామ మెహుల్ చోక్సీ కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడిగానే ఉన్నారు. మోదీకి బెయిల్ ఇప్పించేందుకు శ్రమిస్తున్న లాయర్లు తాజాగా కొత్త అంశంతో తెరమీదకు వచ్చారు.
నీరవ్మోదీ ఇప్పటికే ఒకసారి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవడంతో రెండోసారి దాఖలు చేసిన పిటిషన్లో ఏ చిన్న అవకాశాన్నీ లాయర్లు వదల్లేదు. చివరకు నీరవ్ పెంచుకుంటున్న కుక్కను సైతం సాకుగా వాడుకున్నారు. ఆయన లేని పెంపుడు కుక్క దిక్కు లేనిదైందని, కనీసం దాని కోసమైనా బెయిల్ మంజూరు చేయాలంటూ నీరవ్ తరఫు వకీళ్ల బృందం దయనీయంగా, అంతకుమించి విడ్డూరంగా వేడుకున్నది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. రెండోసారీ బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన న్యాయమూర్తి ఆర్బుత్నట్.. ఏప్రిల్ 26దాకా రిమాండ్ విధించారు.
కాగా, ఈ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు నీరవ్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యులను భయపెట్టే అవకాశముందని భారత్ తరపు న్యాయవాదులు వాదించారు. దీనితో భారత్ తరపు న్యాయవాదుల వాదనకు ఏకీభవించి కోర్టు నీరవ్ మోడీకి బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరించింది. దీంతో `కుక్క`రంగ ప్రవేశం చేసినా ఈ మాజీ వ్యాపారవేత్తకు బెయిల్ దొరకలేదని పలువురు సెటైర్లు వేస్తున్నారు.