కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది పిఎంసి బ్యాంక్  సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజ్‌ను పెంచాలని యోచిస్తోంది. .బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. బ్యాంకుల్లోని డిపాజిట్లపై ప్రస్తుత ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తాన్ని (రూ. లక్ష) పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోందని తెలిపారు.

కేబినెట్ ఆమోదం తెలిపితే.. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లామని పేర్కొన్నారు. పార్లమెంట్ సీతా కాల సమావేశాల్లోనే చట్టాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు.అయితే ఇక్కడ నిర్మలా సీతారామన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఏ స్థాయికి పెంచుతారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద బ్యాంక్ డిపాజిట్ దారులకు రూ.లక్ష వరకు లభిస్తోంది.

బ్యాంక్ డిఫాల్ట్ అయితే లేదంటే బోర్డు తిప్పేస్తే ఈ మొత్తం కస్టమర్లకు లభిస్తుంది. ఇటీవల పీఎంసీ బ్యాంక్ నేపథ్యంలో డిపాజిట్ స్కీమ్ వార్తల్లో నిలిచింది.మరోవైపు కోఆపరేటివ్ సెక్టర్‌లో అతిపెద్ద ఎన్‌జీవో అయిన సహకార్ భారతీ డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తాన్ని రూ.5లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాసింది. బ్యాంక్ డిపాజిట్లకు 1993 నుంచి రూ.లక్ష వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కొనసాగుతూ వస్తోంది. దీని కన్నా ముందు రూ.30,000 కవరేజ్ ఉండేది.


ఇకపోతే బ్యాంక్ డిపాజిట్లకు బీమా కవరేజ్ అందించే డీఐసీజీసీ ప్రస్తుతం రూ.100 డిపాజిట్‌కు 10 పైసల ప్రీమియం వసూలు చేస్తోంది. అన్ని బ్యాంకులకు ఇదే వర్తిస్తుంది. 2005 ఏప్రిల్ నుంచి ఈ ప్రీమియం అమలులోకి వచ్చింది. గతంలో ప్రీమియం 8 పైసలుగా ఉండేది. డీఐసీజీసీ ప్రకారం.. 2019 మార్చి 31 నాటికి 217.4 కోట్ల అకౌంట్లలో 200 కోట్ల అకౌంట్లకు కవరేజ్ ఉంది. అయితే డీఐసీజీసీ, ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ ఈ అంశంపై ఇప్పటిదాకా స్పందించలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: