బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్లు ఉంటాయని మనకు తెలుసు. ఎవరితో సంబంధం లేని వ్యక్తులతో కూడా ఒకే అకౌంట్ ఉంటుందని మనకు తెలీవు..? కానీ బ్యాంకు అధికారులు తలచుకుంటే ఏదైనా సాధ్యమే మరి.. ఇలాంటి సంబంధించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...  

మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా‌లో రోని గ్రామానికి చెందిన హుకుం సింగ్ అనే వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేశాడు. అప్పటి ఆ అకౌంట్ నుంచి అతడికి ప్రతి నెల డబ్బులు పడుతున్నాయి. దీంతో అతడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన హామీ నిలబెట్టుకున్నారని, నల్లధనాన్ని ఇండియాకు తీసుకొచ్చి నెలా నెలా డబ్బులు వేస్తున్నాడని భావించాడు ఆ వ్యక్తి. దీంతో హాయిగా ఆ డబ్బులు డ్రా చేసుకుని జాల్సాలు చేయడం మొదలు పెట్టాడు. గత ఆరు నెలల్లో మొత్తం రూ.89 వేలు డ్రా చేశాడు.

ఇదిలా ఉండగా.. ఓ వ్యక్తి తన అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయని, రూ.1,40,000 బదులు కేవలం రూ.35,400 మాత్రమే ఉన్నాయని తెలిపాడు. దీంతో బ్యాంక్ అధికారులు అతడి వివరాలు పరిశీలించి తలలు పట్టుకున్నారు. ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు కూడా హుకుమ్ సింగ్ కావడం, అతడు నివసిస్తున్న రురాయ్ గ్రామం పేరు కూడా రోని గ్రామం పేరుకు దగ్గరగా ఉండటం, ఇద్దరి వివరాలు దాదాపు ఒకేలా ఉండటం వల్ల ఇద్దరికీ ఒకే బ్యాంకు అకౌంటును కేటాయించినట్లు తెలుసుకున్నారు.

ఫొటో మినహా మిగతా వివరాలన్నీ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండటంతో ఈ తప్పిదం జరిగిందని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రోనీ గ్రామానికి చెందిన హుకుం సింగ్ నుంచి ఆ డబ్బులు వసూలు చేయలేక, రురాయ్ గ్రామానికి చెందిన ఈ హుకుం సింగ్‌కు డబ్బులు చెల్లించలేక బ్యాంకు అధికారులు తలలు పట్టుకున్నారు. మరి, వీరి సమస్య ఎలా పరిష్కరం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: