కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. ఇందులో పలు పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్ కూడా ఇందులో భాగమే. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని అందిస్తోంది. రిక్షా తొక్కేవారు, వీధులు ఊడ్చేవారు, మధ్యాహ్న భోజన వర్కర్లు, వ్యవసార రంగ కూలీలు, నిర్మాణ రంగంలో పనిచేసే వర్కర్లు, బీడి వర్కర్లు, చేనేత కార్మికులు, లెదర్ వర్కర్లు, డొమెస్టిక్ వర్కర్లు, ఆడియోవిజువల్ వర్కర్లు ఇలా వివిధ వృత్తులకు చెందిన వారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఆధార్ కార్డు, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. బ్యాంక్ Savings account లేకపోతే జన్ ధన్ ఖాతా ఉన్నా సరిపోతుంది. జన్ ధన్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వివరాలు ఉంటే ఈ పథకంలో చేరిపోవచ్చు. పథకంలో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు దగ్గరిలోని కామన్ సర్వీసెస్ సెంటర్ (సీఎస్‌సీ)కు వెళ్లాలి. అక్కడ ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా జన్ ధన్ అకౌంట్ ద్వారా స్వీయ ధ్రువీకరణతో పీఎం ఎస్‌వైఎం పథకంలో చేరిపోవచ్చు. స్కీమ్‌లో చేరేటప్పుడు నెల మొత్తాన్ని క్యాష్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 

 
ఎంప్లాయీస్ Provident Fund ఆర్గనైజేషన్ (EPFO) ప్రకారం.. ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్‌లో చేరాలంటే కచ్చితంగా అసంఘటిత రంగానికి చెందిన వారై ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. నెలవారి ఆదాయం రూ.15,000కు పైన ఉండకూడదు. ముఖ్యంగా ఈ పథకంలో చేరాలని భావించే వారు EPF, NPS, ESIC వంటి వాటిల్లో సభ్యులుగా ఉండకూడదు. అలాగే ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా ఈ పథకానికి అనర్హులు. ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పథకం కేవలం అసంఘటిత కార్మికుల మాత్రమే వర్తిస్తుంది.


ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పథకంలో చేరిన తర్వాత అకౌంట్ నుంచి ప్రతి నెల డబ్బులు కట్ అవుతాయి. ఆటో డెబిట్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీన్ని మీరు ఎంచుకోవాలి. ఈ స్కీమ్ ద్వారా ప్రతినెలా రూ.3,000 పెన్షన్ తీసుకోవచ్చు. 60 ఏళ్లు దాటిన తర్వాతనే ఈ పింఛన్ డబ్బులు వస్తాయి. 18 ఏళ్ల వయసులో స్కీమ్‌లో చేరితో అప్పుడు మీరు నెలకు రూ.55 చెల్లిస్తే సరిపోతుంది. మీరు చెల్లించే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మీ పేరుపై మీ అకౌంట్‌కు జమచేస్తుంది. అప్పుడు నెలకు మీ కంట్రిబ్యూషన్ రూ.110 అవుతుంది. అదే మీరు 19 ఏళ్లలో పథకంలో చేరితే అప్పుడు మీ మొత్తం కంట్రిబ్యూషన్ రూ.116, 23 ఏళ్లలో చేరితే రూ.144, 30 ఏళ్లలో చేరితే రూ.210, 40 ఏళ్లలో చేరితే రూ.400 అవుతుంది.


ఒకవేళ సబ్‌స్క్రైబర్ పథకం నుంచి తప్పుకుంటే.. అది కూడా 10 ఏళ్లలోపే ఇలా చేస్తే అప్పుడు సబ్‌స్క్రైబర్ చెల్లించిన మొత్తాన్ని మాత్రమే సేవింగ్స్ బ్యాంక్ వడ్డీతో కలిపి వెనక్కి ఇచ్చేస్తారు. అదే 10 ఏళ్లకు పైన లేదా 60 ఏళ్ల వయసు లోపు స్కీమ్‌ నుంచి తప్పుకుంటే అప్పుడు సబ్‌స్క్రైబర్ వాటాతోపాటు సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ లేదా ఫండ్ అర్జించిన రాబడి రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే దాన్ని కలిసి చెల్లిస్తారు. సబ్‌స్క్రైబర్ ఒకవేళ మరణిస్తే అప్పుడు వారి భాగస్వామి ఈ స్కీమ్‌ను కొనసాగించొచ్చు. ప్రతి నెలా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే సబ్‌స్క్రైబర్ కంట్రిబ్యూషన్, అర్జించిన వడ్డీని కలిపి వెనక్కి తీసుకోవచ్చు. స్కీమ్ మొత్తాన్ని ప్రతి నెలా చెల్లించడంలో విఫలమైతే.. అప్పుడు బకాయి ఉన్న మొత్తాన్ని చెల్లించి స్కీమ్‌ను కొనసాగించొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: