భారతీయ స్టేట్ బ్యాంకు వినియోగదారులకు ఒక చేదు వార్త, మీ డెబిట్ కార్డులు రేపటి నుంచి పని చేయవు. రిజర్వు బ్యాంకు ఈఎంవి చిప్ ఆధారిత ఎటిఎం కార్డులను వినియోగదారులకు అందివ్వాల్సిందిగా అన్ని బ్యాంకులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని బ్యాంకులు ఇప్పటికే తమ వినియోగదారులకు ఈఎంవి చిప్ ఆధారిత డెబిట్ కార్డులను అందించాయి. ఎస్బీఐ మాత్రం మ్యాగ్ స్ట్రైప్ డెబిడ్ కార్డులను మార్చుకోవడానికి డిసెంబర్ 31, 2019 వరకు అవకాశం కల్పించింది.
ఎస్బీఐ మ్యాగ్ స్ట్రైప్ డెబిడ్ కార్డులు కలిగి ఉన్న వినియోగదారులు ఈరోజే బ్యాంకు కు వెళ్లి తమ డెబిట్ కార్డును కొత్త ఈఎంవి చిప్ డెబిట్ కార్డుతో మార్చుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మార్చుకోకపోతే మీరు ప్రస్తుతం వాడుతున్న మ్యాగ్ స్ట్రిప్ డెబిట్ కార్డులు రేపటి నుంచి బ్లాక్ అవుతాయి. ఈ మేరకు ఎస్బీఐ తన వినియోగదారుల కోసం ఒక ప్రకటన విడుదల చేసింది.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మ్యాగ్ స్ట్రిప్ డెబిట్ కార్డులు వాడుతున్న వినియోగదారులకు డిసెంబర్ 31, 2019 వరకు అవకాశం ఇచ్చింది. కొత్తగా జారీ చేసే ఈఎంవి చిప్ ఆధారిత డెబిట్ కార్డులు ప్రస్తుతం ఉన్న మ్యాగ్ స్ట్రిప్ డెబిట్ కార్డుల కంటే ఎంతో సురక్షితమైనవి. ఆన్లైన్ మోసాలకు ఎక్కువగా పాల్పడుతున్న ఈరోజుల్లో ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఈ ఈఎంవి చిప్ ఆధారిత కార్డులను ఆర్బీఐ తీసుకొచ్చింది. ఈ డెబిట్ కార్డుల ద్వారా వినియోగదారులకు మరింత రక్షణ కల్పించనున్నాయి బ్యాంకులు. ఇక మీరు ప్రస్తుతం వాడుతున్న మ్యాగ్ స్ట్రిప్ డెబిట్ కార్డును కొత్త ఈఎంవి కార్డుతో మార్చుకోవాలంటే మీ ఖాతా ఉన్న ఎస్బీఐ శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. ఎస్బీఐ వెబ్సైటు లోనూ మీరు మీ డెబిట్ కార్డును మార్చుకోవచ్చు.