బంగారం కుదవపెట్టాలన్న ఆలోచన ఎవరికి వచ్చినా ముందు గుర్తుకు వచ్చేది ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీనే. ఆ సంస్థ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ పై తాజాగా దాడి జరగటం సంచలనంగా మారింది. మంగళవారం ఉదయం కోచిలోని ఐజీ ఆఫీస్ ఎదురుగా ఈ దాడి జరిగింది. రాళ్ల దాడిలో జార్జ్ అలెగ్జాండర్ తలకు గాయమైంది.
అయితే ఈ దాడిలో ఇంకొక కోణం ఏమిటంటే.. ఇటీవల సుమారు 160 మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించారు. ముత్తూట్లో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులు దీన్ని నిరసిస్తూ కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా సాగింది. ఈ దాడి వెనుక ముత్తూట్ ఉద్యోగులు ఉండరని తాను అనుకుంటున్నట్లు కార్మిక మంత్రి టీపీ రామకృష్ణణ్ తెలిపారు.
ఈ ఘటనకు కారణంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) సంస్థకు చెందిన వ్యక్తులే దాడికి పాల్పడి ఉంటారని ఆరోపించింది. ఈ ఆరోపణల్ని సీఐటీయూ ఖండించింది. తాము ఎప్పుడూ హింసాత్మక ఘటనలకు పాల్పడమని ఆ సంఘ నేత అనంతలవట్టమ్ ఆంనదన్ స్పష్టం చేశారు ఈ ఉదంతంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారి విచారణలో అసలు నిందితులు ఎవరన్నది క్లారిటీ రావాల్సి ఉంది.