నేడు ప్రతిఒక్కరికీ పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. ఆదాయ పన్నుశాఖ అందరికీ కేటాయించే శాశ్వత ఖాతా సంఖ్యను పర్మినెంట్ అకౌం ట్ నంబర్ అంటారు. ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలను దాఖలు చేయడానికి, షేర్లు అమ్మడానికి మరియు కొనడానికి, బ్యాంక్ ఖాతా ప్రారంభించడానికి ఇలా చాలా వాటికి దీని ఉపయోగం ఉంటుంది. అయితే పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్)కార్డుకు చిక్కొచ్చిపడింది. కేంద్ర ప్రభుత్వం పాన్ కలిగిన వారికి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఏకంగా 17 కోట్ల పాన్ కార్డులు పనిచేయకుండా స్తంభించిపోనున్నాయి.
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆదార్, పాన్ కార్డు అనుసంధానానికి గడువును పొడిగిస్తూనే వస్తోంది. దీంతో ఇప్పటి వరకు 8 సార్లు ఈ డెడ్లైన్ను పొడిగిస్తూ వచ్చింది. అయితే ఈసారి మాత్రం ఆ ఛాన్స్ కనిపించడం లేదు. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ఆధార్ కార్డుతో పాన్ నెంబర్ను ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి. దీనికి తాజా గడువు మార్చి 31 వరకు ఉంటుంది. ఈలోపు రెండింటిని అనుసంధానం చేసుకోవాలి. లేదంటే పాన్ కార్డు పనిచేయదు. అయితే ఇప్పటి వరకు ఆ గడువును 8 సార్లు పొడిగించినా కూడా చాలా మంది ఇంకా వారి పాన్ కార్డులను ఆధార్ నెంబర్లతో లింక్ చేసుకోలేదు.
దీంతో 17 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్ నెంబర్తో అనుసంధానం కావాల్సి ఉంది. సో.. మీరు ఒకవేళ పాన్ కార్డును ఆధార్ నెంబర్తో లింక్ చేసుకోకపోతే అప్పుడు మీ కార్డు పనిచేయకపోవచ్చు. ఫైనాన్స్ బిల్లు 2019 ప్రకారం ఆదాయపు పన్ను శాఖకు మీ కార్డులను చెల్లుబాటు కాకుండా చేసే అధికారం ఉంటుంది. దీంతో మార్చి 31 గడువు దాటిన తర్వాత ఆధార్ నెంబర్తో అనుసంధానం కాని పాన్ కార్డులు పనిచేయవు. కాబట్టి వెంటనే మీ పాన్ కార్డును ఆధార్కు లింక్ చేయించుకోండి.