దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బీఐ నిరుద్యోగులకు ఫ్రీగా ఆహారం అందించటంతో పాటు ట్రైనింగ్ ఇచ్చి వ్యాపారానికి లోన్ కూడా అందిస్తోంది. వినడానికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ ఎస్బీఐ నిరుద్యోగులకు, నిరుపేదలకు, వివిధ కారణాల వలన ఉన్నత చదువులు చదువుకోలేనివారికి అండగా నిలవటానికి ముందుకొచ్చింది. 
 
ఎస్బీఐ నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు యువతకు తోడ్పాటుగా నిలిచేలా ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఉపాధి లేని యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఎస్బీఐ ఇప్పటికే దేశవ్యాప్తంగా 587 శిక్షణా సంస్థలను, 151 గ్రామీణ ఉపాధి స్వయం శిక్షణా సంస్థలను ప్రారంభించింది. నిరుద్యోగులకు ఎస్బీఐ శిక్షణతో పాటు ఉచిత భోజన వసతిని కూడా కల్పిస్తూ ఉండటం గమనార్హం. 
 
యువతీయువకులు బయట ఈ కోర్సులు నేర్చుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాలి. కానీ ఎస్బీఐ మాత్రం ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు అవకాశాలను కూడా కల్పిస్తోంది. యువతీయువకులు శిక్షణ పొందటానికి ధరఖాస్తు చేసుకోవాలంటే వారు నివశించే జిల్లాలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. శిక్షణ సంస్థ వివరాలను స్థానిక ఎస్బీఐ బ్యాంకును సంప్రదించి పొందవచ్చు. 
 
తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ కలిగి ఉండి కనీసం 10వ తరగతి పాస్ అయి 18 నుంచి 31 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు శిక్షణ పొందటానికి అర్హులని ఎస్బీఐ పేర్కొంది. శిక్షణ కేంద్రాల ద్వారా ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్, బ్యూటీ పార్లర్, టైలరింగ్, వ్యవసాయ అనుబంధ వృత్తులు, కంప్యూటర్ హార్డ్ వేర్, నెట్ వర్కింగ్, పచ్చళ్లు, మసాలా పౌడర్ల తయారీ, సెల్ ఫోన్ రిపేరింగ్ స్కిల్స్, టూ వీలర్ మెకానిజం, అగరుబత్తుల తయారీ, కొవ్వొత్తులు, ఎంబ్రాయిడరీ, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ,ఇతర కోర్సులలో యువతీయువకులు శిక్షణ పొంది వ్యాపార, ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: