ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య రంగాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. చైనాలో ప్రారంభమైన ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్తో చైనా వాణిజ్య రంగం ఇప్పటికే కుప్పకూలిపోయింది. చైనా నుంచి ప్రపంచ దేశాలు ఇప్పటికే దిగుమతులను నిషేధిస్తున్నాయి. అటు చైనా నుంచి ఎగుమతులు కూడా ఆగిపోయాయి. చైనాలో ఉత్పత్తి రంగం కుప్ప కూలింది. ఇప్పుడు ఈ ప్రభావం ఇతర మార్కెట్లపై సైతం పడింది. అమెరికా, యూకే, ఇటలీ మార్కెట్లపై కరోనా వైరస్ ఎఫెక్ట్ తీవ్రంగా పడింది.
ఇది మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడేగా ట్రేడ్ ఎనలిస్టులు అభిప్రాయ పడుతున్నారు. నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. కరోనా భయాలు ప్రపంచ జీడీపీని కుదేలు చేయనున్నాయని వచ్చిన వార్తలకు తోడు, మరిన్ని దేశాలకు వైరస్ వ్యాపించిందన్న వార్తలు, ఆసియా మార్కెట్లను కుదేలు చేయగా, భారత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించింది. దీంతో సెషన్ ఆరంభంలోనే బెంచ్ మార్క్ సూచికలు భారీగా నష్టపోయాయి.
ఈ రోజు ఉదయమం మార్కెట్లు ఓపెన్ అయిన వెంటనే ట్రేడ్ ఒక్క సారిగా కుప్ప కూలింది. దాదాపు 1100 పాయింట్ల నష్టంతో 38,635 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది సెన్సెక్స్. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 2.80 శాతం నష్టం. ఇక అటు నిఫ్టీ కూడా 280 పాయింట్లు కోల్పోయి 11,319 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, వీఈడీఎల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ తదితర నిఫ్టీ-50లోని అన్ని కంపెనీలూ నష్టాల బాటలోనే నడుస్తున్నాయి.