కరోనా వైరస్ ప్రభావం తో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి . దీనితో మదుపరులంతా షేర్లపై కాకుండా , బంగారం పై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు . ఇప్పటికే బంగారం ధరలు సామాన్యులకు అందకుండా కొండెక్కి కూర్చున్న విషయం తెల్సిందే . ప్రపంచాన్ని చిగురుటాకు మాదిరిగా వణికిస్తోన్న కరోనా మహమ్మారి కారణంగా స్టాక్ మార్కెట్లన్నీ ఘోరంగా దెబ్బ తింటున్నాయి .
ఈ నేపధ్యం లో షేర్లపై పెట్టుబడులు పెట్టి నష్టాలను చవి చూసేకంటే , బంగారం పై మదుపరులు తమ పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపడం తో సోమవారం పదిగ్రాముల బంగారం ధర 517 రూపాయలు పెరిగి , పదిగ్రాముల బంగారం ధర ఏకంగా 40 ,875 రూపాయలకు చేరింది . కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అంత అతలాకుతలమవుతుండడం తో , మదుపరులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించడంతో రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు . ప్రస్తుతం పదిగ్రాముల బంగారం ధర 40 వెలపైచిలుకు పలుకుతున్న విషయం తెల్సిందే . స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఇలాగే కొనసాగితే పదిగ్రాముల బంగారం రెండింతలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు .
అయితే రెండు, మూడు రోజుల క్రితం బంగారం ధరలు బాగా తగ్గాయని వారు చెబుతున్నారు . హైదరాబాద్ లో ఈ సీజన్ లో ఎప్పుడు లేని విధంగా 24 క్యారట్ పదిగ్రాముల బంగారం ధర ఏకంగా 1050 రూపాయల తగ్గుముఖం పట్టడంతో , బంగారం ధరలు దిగి వస్తాయని అందరూ అంచనా వేశారు.కానీ వారి అంచనాలన్నీ ఇప్పుడు తలకిందులయ్యాయి . బంగారం పై పెట్టుబడి పెట్టేందుకు మదుపరులు ఆసక్తి ప్రదర్శించడమే , ధరల పెరుగుదల ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు .