లాక్డౌన్ తర్వాత పరిణామాలపై ప్రధానమంత్రి మోదీ దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చే చర్యలను ఆరంభించనున్నట్లు తెలుస్తోంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం పారిశ్రామిక రంగానికి చెందిన ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులతో సమీక్ష నిర్వహించారు. దేశీయంగా పారిశ్రామిక రంగం చక్కబడాలంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు అవసరమని ఆర్థిక నిపుణులు సూచించారు. అలా జరిగితే ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని తెలిపినట్లు సమాచారం.
ప్రధానమంత్రి మోదీ కూడా వారితో ఏకీభవించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తగిన ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. స్థానిక పెట్టుబడులను ప్రోత్సహించే అంశంపైనా ఈ సమీక్షలో చర్చించారు. వీలైనంత త్వరగా పెట్టుబడులకు అనుమతి ఇచ్చేలా, పారిశ్రామిక భూముల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్థిక సాయం అందించడానికి నిర్దిష్ట పథకం కూడా తీసుకురావాలని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. పారిశ్రామిక రంగానికి భారీ ఉద్దీపన చర్యలుంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పదేపదే ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ కూడా ఆవిషయంపై దాదాపుగా క్లారిటీ ఇచ్చేసినట్లేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కంటితుడుపు చర్యలు ఎంతమాత్రం పారిశ్రామిక రంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేవని భారీ చర్యలే ఆర్థిక పతనాన్ని ఆపగలవని చెబుతున్నారు. ఇదిలా ఉండగా దేశంలో ఇప్పటి వరకు 33,610 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కొత్తగా 560 కరోనా కేసులు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తంగా 1,075 మంది వైరస్ బారిన పడి మృతి చెందగా.. 8,373 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple