ప్రపంచవ్యాప్తంగా చైనా నుంచి దిగుమతి చేసుకోని దేశం లేదంటే అతిశేయోక్తి లేదు. చౌకగా వస్తువులను తయారు చేసి ఎగుమతి చేయడంలో చైనాకు మించిన దేశం లేదనే చెప్పాలి. ఇలా చైనా పారిశ్రామిక ఉచ్చులో అమెరికా సైతం చిక్కుకుని విలవిలాడుతోంది. దాంతో చైనా, తనకు ఏ దేశం ఎదురు తిరిగినా దానిపై ఆర్థిక ప్రతిష్టంబన దాడిని కొనసాగిస్తోంది. కరోనా వైరస్ ఆవిర్భవించిన చైనాపై ఆస్ట్రేలియా కన్నెర్ర చేయడంతో కోపం వచ్చిన చైనా, వెంటనే ఆస్ట్రేలియాలోని నాలుగు ప్రధాన కబేళాల నుంచి గోమాంసం దిగుమతిని నిలిపివేసింది. బార్లీ గింజల దిగుమతులపై భారీ సుంకాలను విధించింది.
ఇప్పుడు భారత్ను కూడా అదే విధంగా ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు వ్యూహ రచన చేస్తోందంట. భారత్ నుంచి ఎగుమతవుతున్న అన్నింటిపైనా నిషేధం విధించాలని యోచిస్తోందంట. భారత్ నుంచి చైనాకు ఎగుమతయ్యే ప్రధానమైనవి వ్యవసాయ రంగం నుంచి అయితే మిర్చి, బియ్యం, గోధుమలు ఉన్నాయి. గ్రానైట్ పరిశ్రమకు చైనాయే పెద్ద ఆధారమని చెప్పాలి. ఇండియాలోని గ్రానైట్లో దాదాపు 50శాతం చైనాకు దిగుమతి అవుతుండటం గమనార్హం. చైనా గ్రానైట్ దిగుమతులపై నిషేధం విధిస్తే మాత్రం ఈ రంగం అతలాకుతలం అవడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
2001లో భారత్, చైనా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 3.6 కోట్ల బిలియన్ డాలర్లు. కానీ, 2019లో దాని విలువ ఏకంగా 90 కోట్ల బిలియన్ డాలర్లకు పెరిగింది. భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అనే చెప్పాలి. ప్రస్తుతం సాధారణ ఔషధాలకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారు. ఇందులో చైనా భాగస్వామ్యం ఉంది. ఈ ఔషధాలకు ముడి సరకు చైనా నుంచి వస్తుంది. రెండు దేశాలు ఒక దేశంలో ఒకటి పెట్టుబడులు కూడా పెట్టాయి. ఇదిలా ఉండగా చైనా యాప్స్పై నిషేధం విధిస్తూ భారత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పెను సంచలనం సృష్టించింది. లఢఖ్లోని గాల్వన్ వ్యాలీలో ఉన్న భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణ అనంతరం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.