రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల సొంత రికార్డులను తానే చెరుపుతూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. తాజాగా ఈ కంపెనీ ఎం-క్యాప్ పరంగా రూ.11.7 లక్షల కోట్ల మార్క్​ను కూడా దాటింది. కరోనా సంక్షోభంలోనూ ఈ స్థాయిలో రిలయన్స్ దూకుడుకు కారణాలేమిటి? కరోనా కాలంలో రిలయన్స్ తీసుకున్న నిర్ణయాలు సంస్థను ఎలా లాభాల బాట పట్టించాయి?

 

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును నెలకొల్పింది. స్టాక్ మార్కెట్లలో సోమవారం రిలయన్స్ షేర్లు 3.50 శాతానికిపైగా వృద్ధిచెంది... ఒక షేర్ విలువ రూ.1,851కి చేరింది. దీనితో సంస్థ మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్) రూ.11,73,677 కోట్లు దాటింది. దేశీయంగా ఈ స్థాయి ఎం-క్యాప్​ను అందుకున్న ఏకైక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే.కరోనా సంక్షోభంతో దిగ్గజ సంస్థలు ఒడుదొడుకులు ఎదుర్కొంటుంటే.. రిలయన్స్ మాత్రం దాని రికార్డులు అదే చెరుపుకుంటూ మందుకు సాగుతోంది. వీటన్నింటికీ రిలయన్స్ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాలే కారణం.

 

రిలయన్స్​ను ఈ ఆర్థిక సంవత్సరంలో రుణరహితంగా మార్చాలని సంస్థ అధినేత ముకేశ్​ అంబానీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు ప్రపంచలోనే అతిపెద్ద చమురు సంస్థ సౌదీ ఆరామ్​కోకు వాటా విక్రయించాలని నిర్ణయించింది రిలయన్స్. ఇందులో భాగంగా ఇరు సంస్థల మధ్య రూ.14 లక్షల కోట్ల ఒప్పందం కుడా కుదిరింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ ఒప్పందం పూర్తవ్వాల్సి ఉండగా.. కరోనా సంక్షోభంతో అది కుదరలేదు. ఫలితంగా జియోలో వాటాల విక్రయం, రైట్స్ ఇష్యూల వంటి నిర్ణయాలు తీసుకుంది రిలయన్స్.

 

 

అప్పులు లేని సంస్థగా రిలయన్స్​ను నిలబెట్టేందుకు జియోలో 25 శాతం వాటా విక్రయించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే తొలుత ఫేస్​బుక్​కు దాదాపు 10 శాతం వాటా విక్రయించారు. ఫేస్​బుక్ లాంటి సంస్థ పెట్టుబడులు పెట్టిన తర్వాత విదేశీ కంపెనీల దృష్టి జియోపై పడిది. అలా ఇప్పటి వరకు మొత్తం 11 విదేశీ సంస్థలు (ఫేస్​బుక్​తో కలిపి) 12 దఫాల్లో పెట్టుబడి పెట్టాయి.
దీనితో రిలయన్స్ కేవలం రెండు నెలల్లోనే రూ.1.17 లక్షల కోట్లు సమీకరించుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: