కరోనా కాటుకు హోటల్స్,లాడ్జింగ్ రెస్టారెంట్, హోటల్ రంగం బలైంది. సాధారణ సమయాల్లో చాలా మంచి లాభసాటి వ్యాపారంగా నిలవడంతో పాటు ప్రత్యక్షంగా లక్షలాదిమందికి ఉద్యోగా అవకాశాలు కల్పించింది. ప్రాంతాలను బట్టి ఈ రంగం శతాబ్దాలు వర్ధిల్లుతోంది. మెట్రో నగరాల్లోని హోటళ్లయితే దారుణంగా తయారయ్యాయి. పర్యాటకులు లేక..ఉద్యోగుల జీతాల భారం మోయలేక చేతులెత్తేస్తున్నాయి. భోజనప్రియులతో కళకళలాడే హోటల్స్ కరోనా మహమ్మారి పుణ్యమా అని మూతబడ్డాయి. సిబ్బందికి వేతనాలు, విద్యుత్ బిల్లులు, అద్దె భారం తడిసి మోపెడవుతోందంటూ యజమానులు గొల్లుమంటున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామికంతో పాటు మిగతా కొన్ని సెక్టార్లకు చేయూతనిస్తోంది. ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించే హోటల్ రంగంపై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామంలో భాగంగా మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటల్ రంగానికి కూడా పెద్ద దెబ్బే పడింది. పర్యాటక రంగాన్ని పడకేసేలా చేసింది. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ హోటళ్లు మూతపడ్డాయి. రెస్టారెంట్లు బంద్ అయ్యాయి. హోటల్ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ సుమారు సుమారు రెండు లక్షల మంది ఉద్యోగ, ఉపాధికి ముప్పు వాటిల్లింది. హోటల్స్, రెస్టారెంట్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది.
అయితే ఇప్పుడు కొంతమంది వ్యాపారులు హోటళ్లను ఆఫీసులుగా మార్చుతున్నారు. ఆఫీసులుగా మార్చి సొంత వ్యాపారులుగా మారుతున్న వారు కొందరైతే..ఆఫీస్ తరహాలో నిర్మాణంలో మార్పులు..చేర్పులు చేస్తూ ఆఫీసులకు రెంట్కు ఇచ్చేస్తున్న వారు అనేక మంది. హోటల్ వ్యాపారం ఇప్పట్లో కుదురుకునే పరిస్థితి లేకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. అంతా సర్దుకుంటే మళ్లీ పాత వ్యాపారంలోకి రావడానికి సిద్ధమే. తరతరాలుగా హోటల్ వ్యాపారంలో ఉంటూ వినియోగదారుల ప్రశంసలు అందుకుని తమకు ఇలాంటి పరిణామం నిజంగా బాధ కలిగిస్తోందని కొంతమంది వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.