ఆర్టీసీ సంస్థ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది. వెంటాడుతున్న ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తోంది.లాక్‌డౌన్‌తో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడిన వేళ.. కార్గో, కొరియర్, పార్శిల్ సేవల ద్వారా ఆర్టీసీకి చెప్పుకోదగ్గ మొత్తంలో ఆదాయం లభిస్తోంది. కరోనాకు ముందు ఆర్టీసీకి రోజూ రూ.5 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రూ. 2 కోట్లు రావడం కూడా కష్టంగా మారింది. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవడం, సొంత వాహనాల్లో వెళ్లడానికి ప్రాధాన్యం ఇవ్వడమే దీనికి కారణం. కాగా.. ఇటీవల ప్రారంభించిన కార్గో సేవలు ఆర్టీసీకి ఊరటనిస్తున్నాయి.


వాస్త‌వానికి సంవ‌త్స‌ర‌కాలంగా  ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రకరకాల సమస్యలకు తోడు ‘కరోనా లాక్‌డౌన్’‌ మరింత దెబ్బ తీసింది. 50 రోజులకుపైగా బస్సులను మూలకు పెట్టాల్సి రావడంతో సుమారు రూ.700 కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోయిందనే చెప్పాలి.  దీంతో కార్గో, పార్శిల్‌ సేవల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రైవేటు సంస్థలకు పోటీగా వ్యాపారాన్ని నడిపిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ప్లాన్‌ను రెడీ చేసింది. ఓ డ్రైవింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ముందుగా కొత్తగా మూడు డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తోంది.  ఈ శిక్షణకు ఇంకా ఫీజును నిర్ణయించలేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చి శిక్షణ తీసుకునేవారికి హైదరాబాద్‌లో  హాస్టల్ ‌ సౌకర్యం కూడా కల్పించే అవకాశాలున్నాయి. 

 

దీనికి అదనపు ఫీజు తీసుకుంటార‌ని తెలుస్తోంది. పూర్తి మార్గ‌ద‌ర్శ‌కాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. ఇందులో తేలికపాటి వాహనాలైన కార్లు మొదలు.. భారీ వాహనాల దాకా.. ప్రైవేటు వ్యక్తులకు శిక్షణనిచ్చేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఒకే బ్యాచ్‌లో ఏకంగా 20 వేల మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యంతో హైదరాబాద్‌లో రెండు, వరంగల్‌లో ఒకటి చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేయాలని  ని‌ర్ణయించారు. 40 రోజుల శిక్షణలో 10 రోజులు థియరీ క్లాసులు, 30 రోజులు ప్రాక్టికల్‌ క్లాసులుంటాయని అధికారులు అంటున్నారు. ఈ కొత్త ప్లాన్ అద్భుతంగా ఉందంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: