దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలతో బేర్ మన్నాయి. అంతర్జాతీయంగా కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణ తగ్గి విపరీతంగా కేసులు పెరగడంతో ఆ ప్రభావంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.బీఎస్ఈ 660 పాయింట్లు నష్టపోయి 36,033 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు కుంగి 10,607 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. హాత్వే కేబుల్ అండ్ డేటా, ఎఫ్డీసీ లిమిటెడ్, ర్యాలీస్ ఇండియా షేర్లు భారీగా లాభపడగా.. బీహెచ్ఈఎల్, ఆర్బీఎల్ బ్యాంక్, జిందాల్ స్టెయిన్లెస్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఒక్క టెలికామ్ తప్ప అన్ని రంగాలకు చెందిన సూచీలు కుంగాయి. సూచీల్లోని ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్షేర్లు 5శాతానికి పైగా పతనం అయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ మంగళవారం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 273 పాయింట్ల నష్టంతో 36419 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లను కోల్పోయి 10732 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఐటీ, ఫార్మా రంగ షేర్లకు మాత్రమే కొనుగోళ్ల మద్దతు లభించింది. మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా అదుపులేకుండా విజృంభిస్తుండటంతో మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ను బలహీనపరిచిందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం తప్పదనే బలమైన సంకేతాలు కూడా మార్కెట్లపై ప్రభావానికి కారణం అయ్యుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కీలక రంగాలైన ఆటోమొబైల్, మెటల్, ఫైనాన్షియల్ రంగాల గణాంకాలు రావడం కూడా మర్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2శాతానికి పైగా నష్టపోయాయి. ముఖ్యంగా వాహన రుణాల విషయంలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు రావడం, విక్స్ సూచీ కూడా పెరగడం ఇన్వెస్టర్లను భయపెట్టింది.
సెన్సెక్స్ ఇండెక్స్లో టైటాన్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో షేర్లు మాత్రమే లాభాలను నమోదు చేయగా, మిగిలిన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, పవర్గ్రిడ్ షేర్లుఅత్యధిక నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ పరిణామాలతో ఉదయం నుంచే నష్టాల బాట పట్టిన దేశీయ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 660.63 పాయింట్లు దిగజారి 36,033 వద్ద ముగియగా, నిఫ్టీ 195.95 పాయింట్లు నష్టపోయి 10,607 వద్ద ముగిసింది.