దేశీయ టెలికాం రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి రిలయన్స్ జియో తన ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. నెలకో రకమైన ఆకర్షణీయమైన ప్లాన్ను ప్రకటిస్తూ మరింతమంది కష్టమర్లను తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. జియో 4జీ ఫీచర్ ఫోన్ను వాడుతున్న వినియోగదారులకు ఓ శుభవార్త తెలిపింది.
భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ ఆఫర్ను ప్రకటించింది. జియో తన 4జీ ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం రూ.49 ప్లాన్ను ఆవిష్కరించింది. దీనిలో ఉచిత వాయిస్ కాల్స్, 1జీబీ 4జీ డేటాతో పాటు 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. అలాగే వీరి కోసం రూ.11, రూ.21, రూ.51, రూ.101 ధరల్లో డేటా యాడ్–ఆన్ ప్లాన్లను ప్రకటించింది.
ఈ ప్లాన్లను జియో అఫిషియల్ సైట్లో పొందుపరిచింది. ఇప్పటికే జియో తాను అందిస్తున్న పలు ప్లాన్ల డేటా బెనిఫిట్స్ను పెంచగా, తాజాగా జియో ఫోన్ కోసం ఈ కొత్త ప్లాన్ను, యాడాన్ ప్యాక్స్ను లాంచ్ చేయడం విశేషం.