మినిమం బ్యాలెన్స్ నిల్వ కూడా లేదన్న కారణంతో కొన్ని బ్యాంకులు ఖాతాదారుల గూబ గుయ్యిమనిపిస్తోంది. మినిమం బ్యాలెన్స్ లేదన్న సాకుతో ఖాతాదారుల నుండి కొన్ని బ్యాంకులు 2017-18 ఆర్ధిక సంవత్సరంలో సుమారు రూ. 5 వేల కోట్లు వసూళ్ళు చేశాయి. అంటే బడాబాబులు తీసుకున్న రుణాలను చెల్లించని కారణంగా వస్తున్న నష్టాలను సామాన్య జనాల నుండి నిబంధనల పేరుతో ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నట్లే కనిపిస్తోంది.
సేవలను మరచిపోతున్న బ్యాంకులు
సేవలను మరచిపోతున్న బ్యాంకులు
ఇంతకీ విషయం ఏమిటంటే, ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేదన్న సాకుతో వినియోగదారులకు కొన్ని బ్యాంకులు జరిమానాలు విధిస్తూ చుక్కలు చూపిస్తున్నాయి. వివిధ కారణాలతో బ్యాంకులకు వస్తున్ నష్టాలను ఏదో ఒక రీతిలోభర్తీ చేసుకోవాలన్న ఆలోచనే తప్ప ఖాతాదారులకు సేవలు అందించాలన్న కనీస సూత్రాన్ని కూడా బ్యాంకులు మరచిపోతున్నాయి. కనీస బ్యాలెన్స్ అన్న నిబంధనను స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాతో పాటు యాక్సిస్, హెడిఎఫ్సి , ఐసిఐసిఐ తదితర బ్యాంకులు కచ్చితంగా పాటిస్తున్నాయి.
లక్షల కోట్లలో ఎగవేతలు
ఆర్దిక సంవత్సరంలో ఎస్బిఐ బ్యాంకు రూ. 2433 కోట్లు, హెచ్ డిఎఫ్ సి బ్యాంకు రూ. 590 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ. 530 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంకు రూ. 317 కోట్లు జరిమానాల రూపంలో ఖాతాదారుల నుండి వసూళ్ళ చేయటం గమనార్హం. ఒకవైపేమో లక్షల కోట్ల రూపాయలు బడాబాబుల ఖాతాల్లోకి చేరిపోతున్నాయి. పరిశ్రమల ఏర్పాటు పేరుతోనో లేకపోతే ఏదో ఒక కారణం చూపి అనేక మంది పారిశ్రామిక వేత్తలు వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని ఎగ్గొడుతున్నారు. అంటే అది కూడా ప్రజాధనమే. బడాబాబులు ఎగ్గొడుతున్న లక్షల కోట్ల రూపాయల వసూళ్ళలో చేతులెత్తేస్తున్న బ్యాంకులు సామాన్య జనాలను మాత్రం నిబంధనలను పేరుతో చావగొడుతున్నాయి. మినిమం బ్యాలెన్స్ ను కూడా మెయిన్ టైన్ చేయటం లేదంటే ఖాతాదారుల పరిస్ధితేంటో కూడా బ్యాంకులు అర్ధం చేసుకోకపోవటం నిజంగా దురదృష్టకరమే.