దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. ఒక్కసారిగా 500 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ ఢమాలమంది. నిఫ్టీ సైతం 11,300 మార్కు కిందకి పడిపోయింది. గత ఆరు నెలల కాలంలో ఇదే అతిపెద్ద నష్టం.  అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.73కు పడిపోవడం, అమెరికాచైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. 


మధ్యాహ్న సెషన్‌లో నెలకొన్న మరింత అమ్మకాల ఒత్తిడి, మార్కెట్లకు కుప్పకూల్చింది. అంతకంతకు పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరలు, ట్రాడే వార్‌ ఆందోళనలు, రూపాయి విలువ భారీగా క్షీణించడం, నేడు కూడా చరిత్రాత్మక కనిష్ట స్థాయిల్లోకి రూపాయి కూరుకుపోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 509 పాయింట్లు పతనమై 37,413కు పడిపోయింది. నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 11,287కు దిగజారింది. మార్చి 16 తర్వాత ఒక్క రోజులో ఈ స్థాయిలో సెన్సెక్స్ పతనమవడం ఇదే తొలిసారి.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:రెడింగ్టన్ ఇండియా (5.80%), వరుణ్ బెవరేజెస్ (4.77%), క్వాలిటీ (4.77%), కార్బోరండమ్ యూనివర్సల్ లిమిటెడ్ (3.63%), ఫైజర్ (2.82%).టాప్ లూజర్స్:పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (8.20%), మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (-6.82%), స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ (-6.81%), ఎన్ఐఐటీ టెక్నాలజీస్ (-6.00%), గేట్ వే డిస్ట్రిపార్క్స్ (-5.73%).


ఇక కోటక్ బ్యాంక్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు 2 నుంచి 3.5 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆల్‌-టైమ్‌ కనిష్ట స్థాయిల్లోకి పతనమైంది. 72.74 వద్ద అత్యంత కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. గత ఆరు నెలల్లో అ‍త్యధికంగా నష్టపోయింది నేడేనని మార్కెట్‌ విశ్లేషకులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: