దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోకి మళ్లాయి. లాభాలతో ప్రారంభమైన కీలక సూచీలు అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. దీనికి తోడు రూపాయి విలువ పతనాన్ని నిలువరించడానికి అనవసరమైన దిగుమతులను నిషేధిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన కూడా ఇన్వెస్టర్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 505 పాయింట్లు పతనమై 37,585 వద్ద, నిఫ్టీ 138పాయింట్లు కోల్పోయి 11,376 స్థాయికి చేరింది.
దాదాపు అన్ని రంగాల్లోనూ నష్టాలే. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ టాప్ లూజర్ గా ఉంది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా , ఆటో, ఐటీ నష్టపోతుండగా, రియల్టీ స్వల్పంగా లాభపడుతోంది. హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, ఐబీహౌసింగ్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్యూఎల్, ఎన్టీపీసీ టాప్ లూజర్స్గా ఉండగా, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఎయిర్టెల్, ఐవోసీ, టెక్ మహీంద్రా, విప్రో, టాటా స్టీల్, ఐషర్, హెచ్సీఎల్ టెక్, పవర్గ్రిడ్ లాభపడుతున్నాయి.
ఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ నెట్ వర్క్స్ (14.74%), అవంతి ఫీడ్స్ (13.14%), మోన్శాంటో ఇండియా (10.73%), వెంకీస్ ఇండియా (10.00%), సుజ్లాన్ ఎనర్జీ (9.00%).
టాప్ లూజర్స్:
అశోకా బిల్డ్ కాన్ (-6.08%), క్వాలిటీ (-4.88%), రెడింగ్టన్ ఇండియా (-4.34%), ఐసీఐసీఐ లొంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (-4.30%), బాటా ఇండియా (-4.25%).
ఈనాటి ట్రేడింగ్ లో మొత్తం 957 స్టాకులు నష్టాలను మూటకట్టుకోగా... 796 స్టాకులు లాభాలను చవిచూశాయి. నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, సన్ ఫార్మా తదితర పెద్ద సంస్థలు 2 నుంచి 3 శాతం వరకు నష్టపోయాయి. దీంతో తొలుత ఆసియా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు తెరలేచింది. అలాగే దేశీయంగా డాలరుతో మారకంలో రూపాయి సైతం ఒక్కసారిగా బలహీనపడింది.