కరవుసీమ అనంతపురం జిల్లాలో వజ్రాల వేట ప్రారంభమైంది.
తొలకరి చినుకులు పలకరించడంతో వజ్రకరూరు మండలంలోని పొలాల్లో వజ్రాల అన్వేషణ మొదలైంది.
ఈ ప్రాంతం వారే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పొలాలను తూర్పారబడుతున్నారు.

ఏ చిన్న రంగురాయి దొరికినా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ ప్రాంతమంతా ఇసుకతో కూడిన ఎర్రనేలలు కావడంతో జూన్‌ లో తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే భూమిలోపల ఉన్న వజ్రాలు పైకి వస్తాయని, పొలంలో నీరు పారినప్పుడు అవన్నీ ఏటవాలుగా ఉన్న ప్రాంతానికి చేరుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. అందువల్లే ఇక్కడికి వచ్చే వారంతా పొలాల్లో అణువణువూ వెతుకుతున్నారు. ఈ ప్రాంతంలో ఏటా 10 నుంచి 20 దాకా వజ్రాలు దొరుకుతాయనీ, ఇక్కడ లభించే వజ్రాలు కోహినూర్‌తో సమానంగా ధర పలుకుతాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ ప్రాంతంలో ఒక మోస్తరు వర్షం కురవగా... స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా ఉదయాన్నే పొలాలకు వెళ్లి వజ్రాల వేటలో ఉన్నారు. ఏటా ఇక్కడ లభించే వజ్రాలను గుట్టు చప్పుడు కాకుండా కొందరు దళారులు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తారని, స్థానికులు చెబుతున్నారు.

 వజ్రకరూర్‌లోని పలు ప్రాంతాలను శాస్త్రవేత్తలు సందర్శించి, భూమి నమూనాలు సేకరించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు లభించే అవకాశాలు వున్నాయని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తెలియజేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: