భారత రిజర్వు బ్యాంక్‌(ఆర్బీఐ) వడ్డీ రేట్లను కేవలం పావు శాతం మాత్రమే తగ్గించింది. మార్కెట్‌ కనీసం అరశాతం తగ్గిస్తుందన్న అంచనాలకు భిన్నంగా ఆర్బీఐ 0.25 శాతం తగ్గించేందుకు ఆమోదించింది.  దీంతో రెపో రేటు 5.75 శాతానికి, రివర్స్‌ రెపో రేటు 5.5 శాతానికి తగ్గింది. మూడు రోజుల సమావేశం తరవాత మానిటరింగ్‌ పాలసీ కమిటీ (ఎంపీసీ)  ఇవాళ  రెపో రేటును  తగ్గించాలని నిర్ణయించింది. 

కమిటీలోని ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌బీఎఫ్‌సీల కోసం ప్రత్యేక చర్యలు ఉంటాయని ఆర్బీఐ చెప్పినా... కచ్చితంగా ఎలాంటి చర్యలు ఇవాళ ప్రకటించలేదు. 2020 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును తగ్గించింది. 2019-20 తొలి ప్రథమార్థంలో జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతం నుంచి 6.7 శాతం వరకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. 


అలాగే ద్వితీయార్థంలో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం నుంచి 7.5 శాతం ఉండొచ్చని పేర్కొంది.  అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో వినియోగదారుల ధరల సూచీ  3 శాతం నుంచి 3.1 శాతం మధ్య ఉండొచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.

వడ్డీ రేటుతో పాటు ఆర్బిఐ మరో నిర్ణయం కూడా తీసుకుంది.  ఆన్‌లైన్‌లో ఆర్‌టీజీఎస్‌, నిఫ్ట్‌ పద్ధతిలో నగదు బదిలీపై ఎలాంటి చార్జీలు ఉండవని ఆర్బీఐ స్పష్టం చేసింది. పరపతి విధానం ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు వెంటనే ఖాతాదారులకు వర్తింప జేయాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు ఆర్టీజీఎస్‌, నిఫ్ట్‌ బదిలీలపై వసూలు చేసిన చార్జీలు రద్దవుతాయి. 2010 తరవాత రెపో రేటును ఆరు శాతం దిగువకు రావడం ఇదే తొలిసారి.


మరింత సమాచారం తెలుసుకోండి: