ఆ బుక్ షాప్లో అడుగు పెట్టాక ఏదో ఒక పుస్తకం కొనకుండా బయటకు రాలేం. అలా ఆకట్టుకునే పుస్తక లోకం అది. సోమాజీ గూడలోని వాల్డెన్ బుక్ షాప్ అది.
గత 30 ఏండ్లుగా పుస్తక ప్రియులకు అడ్డాగా నిలిచిన ఈ బుక్ షాప్ ఈ నెలాఖరికి మూతబడనుంది. ''ఇంటర్నెట్ సదుపాయం విస్తరించిన తర్వాత,కావాల్సిన పుస్తకాలన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఏ పుస్తకం కావాలన్నా పీడీఎఫ్ రూపంలో లభిస్తోంది. యువతలో పుస్తక పఠనం తగ్గడం, ఆన్లైన్లో భారీ రాయితీలు ఇస్తుండటం, సిటీలో ట్రాఫిక్ సమస్యలతో స్టోర్ వరకు వచ్చే వరకు క్రమంగా జనం తగ్గుతుండంతో సోమాజిగూడ వాల్డెన్ బుక్స్టోర్ను ఈనెలాఖరుతో మూసేయబోతున్నట్లు ...'' వాల్డెన్ బుక్ షాప్ అకౌంటెంట్ ఈ ప్రతినిధితో అన్నారు.
ప్రముఖులకు ప్రియమైనది...
వాల్డెన్ స్టోర్కు అప్పటి రాజకీయ ప్రముఖులు అశోక్గజపతి రాజు, ఎర్రం నాయుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సినీ స్టార్స్ పవన్ కల్యాణ్, నాగార్జున, శ్రీదేవి, బోనీ కపూర్, జగపతిబాబు, వెంకటేశ్లతో పాటు ప్రస్తుత గవర్నర్ నరసింహన్, సినీ దర్శకులు ఈ బుక్ షాప్లో అడుగు పెట్టిన వారే..!!
పుస్తకశాల పేరు వెనుక..
'వాల్డెన్'.. అనేది ప్రసిద్ధ పుస్తకం పేరు. డేవిడ్ హెన్రీ అనే గొప్ప తత్వవేత్త రాసిన పుస్తకం. ఏమి లేకుండా రెండేళ్లపాటూ ఆడవులకు వెళ్లిపోయి అక్కడ వాల్డెన్ అనే సరస్సు చెంత తన అనుభవాలను పుస్తకంలో రాశారు. మేము ఈ పేరు పెట్టడానికి మా పుస్తకశాల ప్రశాంతమైన సరస్సులాగా ఉండాలని కోరుకున్నాం. అలానే ఇక్కడికొచ్చేవారు ప్రశాంతత, ప్రేరణ పొందేవారు. అందుకే ఈ బుక్ స్టోర్కి ఆ పేరు పెట్టాం .. ' అని నిర్వాహకులు అంటున్నారు. (pic/shyammohan)