అరిటాకులో అద్భుతమైన బిర్యానీ !  కేవలం 127 రూపాయలకే. వేడి వేడి బిర్యానీ తినాలనుందా? వెరైటీగా అరిటాకులోనా?  అయితే కేరళలోని వియ్యూరు సెంట్రల్‌ జైలుకి ఆర్డర్‌ ఇవ్వాలి. అక్కడి జైలులో అధికారులు ఖైదీలతో నోరూరించే, బిర్యానీలను తయారుచేయించి ప్రజలకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే వినూత్న ఆలోచన చేశారు. 

తొలి దశలో బిర్యానీ కాంబో ధరని 127 రూపాయలుగా నిర్ణయించారు. రుచికరమైన బిర్యానీ అతి తక్కువ ధరలో అందుబాటులోకి రావడంతో కేరళలోని వియ్యూరు ప్రజలు ఆ బిర్యానీ కోసం ఎగబడుతున్నారు.

బిర్యానీలో ఏముంటాయంటే... 300 గ్రాముల బిర్యానీ, మూడు చపాతీలూ, ఒక చికెన్‌ లెగ్‌ పీస్‌, ఒక కప్‌ కేక్‌, సలాడ్‌, పచ్చడి, ఒక లీటర్‌ వాటర్‌ బాటిల్‌తో పాటు సాంప్రదాయబద్ధంగా అరిటాకుని కూడా ప్యాక్‌ చేసి కాంబో ప్యాక్‌లో ఇస్తారు. ఇంతకంటే ఏం కావాలి బిర్యానీ ప్రియులకు ?

కాల్‌ చేస్తే చాలు...

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ తో ఒప్పందం చేసుకుని జైలు నుంచి పార్శిళ్లను వినియోగదారుల ముంగిళ్లలోకి చేర్చే ఏర్పాటు చేశారు జైలు అధికారులు. కేరళ జైళ్లలోని ఖైదీలు తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను ఫ్రీడం ఫుడ్‌ ఫ్యాక్టరీ ఎంటర్‌ప్క్రెజెస్‌ ద్వారా 2011 నుంచే అమ్మకానికి పెట్టారు కానీ, ఆన్‌లైన్‌లో అమ్మకాలు మాత్రం ఇదే తొలిసారి అని వియ్యూరు సెంట్రల్‌ జైలు అధికారులు అంటున్నారు. 2011 నుంచి ఖైదీలు చపాతీలు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రోజుకి 25,000 చపాతీలు, 500 బిర్యానీలు తయారు చేసి సరఫరా చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: