బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు తోడు.. వరుస సెలవులు రావడంతో.. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకులు పనులు చేయనున్నాయి. విలీనాన్ని వ్యతిరేకిస్తూ... తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్లు. ఆరు బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయడం.. కొన్ని బ్రాంచ్ లను మూసివేయడం.. ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ నెల 26, 27 తేదీల్లో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి యూనియన్లు.
రెండు రోజుల సమ్మెతో పాటు.. 28న నాలుగో శనివారం, 29 న ఆదివారం కావడంతో వారం రోజుల్లో కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంక్ కార్యకలాపాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న బ్యాంకులు పని చేస్తాయి. వెంటనే అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి కావడంతో ఆ రోజు కూడా సెలవు కారణంగా మూతపడనున్నాయి.
మొత్తం మీద.. వరుస సెలవులు కావడంతో.. రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ జరిపే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వరుస సెలవులు కావడంతో.. ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా.. ఏటీఎంల్లో డబ్బు నిల్వలను పెంచామనీ, ఆన్లైన్ సేవలు, ప్రైవేట్ బ్యాంకుల సేవలు యథావిథిగా జరుగుతాయంటున్నాయి బ్యాంకులు.
బ్యాంక్ వినియోగదారులా.. విషయం తెలిసింది కదా.. ఇక జాగ్రత్త పడండి.. రాబోయే రెండు మూడు రోజుల్లో బ్యాంకుల్లో డబ్బులు ఉండి కూడా ఇబ్బంది పడకుండా అలర్ట్ గా ఉండండి. లావా దేవీలను జరిపేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా ఉపశమనం పొందండి.