అదేదో సినిమాలో చూపినట్లుగగా నెల్లూరు జిల్లాలో సంచలనం జరిగింది. బుధవారం రాత్రి జిల్లలోని రాపూర్ పోలీస్టు స్టేషన్ పై మూకుమ్మడి దాడి జరిగింది. స్టేషన్లో ఉన్న పోలీసులను పట్టుకుని ఎవరన్నది కూడా చూడకుండా చితక్కొట్టేశారు. దాడిలో ఆడా,మగా, పిల్లా, పెద్దా అంతా కలిసి దాడి చేయటం ఇపుడు రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. సరే, సినిమాల్లో చూపినట్లుగానే అంతా అయిపోయిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారనుకోండి అది వేరే సంగతి.
ఫిర్యాదే అసలు కారణమా ?
ఇంతకీ విషయం ఏమిటంటే, మండలంలోని దళితవాడలోని జోసెఫ్ నుండి పిచ్చయ్య, లక్ష్మమ్మ దంపతులు డబ్బు అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పు ఎంతకీ తీర్చకపోవటంతో జోసెఫ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ చేసేందుకు పోలీసులు పిచ్చయ్య దంపతులను స్టేషన్ కు పిలిపించారు. వారితో పాటు మరో యువకుడిని కూడా పోలీసులు పట్టుకొచ్చారు. అక్కడేమైందో ఎవరికీ తెలీదు.
పోలీస్టేషన్ పైనే దాడి
దంపతులు పోలీసు స్టేషన్లో ఉండగానే దళితవాడకు చెందిన వారు హటాత్తుగా పోలీసు స్టేషన్ పై దాడికి దిగారు. ఆ సమయంలో ఎస్ఐతో పాటు ఇంకా చాలా మంది కానిస్టేబుళ్ళున్నారు. పోలీసుస్టేషన్లోకి దూసుకురావటమే ఆలస్యం ఆడా, మగా అంతా కలిసి ఒక్కసారిగా దాడికి దిగారు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే ఎస్ఐతో పాటు మిగిలిన సిబ్బందిని కూడా స్ధానికులు చచ్చేట్లు కొట్టారు.
ఎస్ఐ తలపై ఏడు కుట్లు
దాడిలో ఎస్ఐతో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐకి ఏకంగా తలపై ఏడు కుట్లు పడ్డాయంటే ఎంతలా కొట్టారో తెలిసిపోతోంది. ఇంతలో విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన దాడి జరిగిపోయింది. దాంతో చేసేది లేక గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటికి ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు. దాడికి సంబంధించి ఎవరి వాదన వారు వినిపిస్తున్నారనుకోండి .