కావాల్సిన పదార్థాలు:
మైదా పిండి- పావుకిలో
ఉడికించిన నూడుల్స్- ఒకటిన్నర కప్పు
రెడ్ చిల్లీ సాస్- ఒక టీస్పూన్
సోయాసాస్- ఒక టీ స్పూన్
ఉల్లికాడల తురుము- రెండు స్పూన్లు
వాము- అరటీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీస్పూన్
క్యాబేజీ తురుము- అర కప్పు
కార్న్ ఫ్లోర్- ఒక టీస్పూన్
క్యారెట్ తరుగు- అర కప్పు
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు- అర కప్పు
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు వేసి బాగా కలపాలి. పిండిని ముద్దలా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తరుగు, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్ వేసి కలపాలి. తర్వాత ఉల్లికాడల తురుము కూడా వేసి వేయించాలి.
తరువాత కాస్త ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి వేయించాలి. అవి వేగాక ఉడికించిన నూడుల్స్ ను వేసి కలపాలి. ఒక ఐదు నిమిషాలు నూడుల్స్ వేగాక ప్లేటులోకి తీసుకుని... తడి ఎక్కువ లేకుండా ఆరనివ్వాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల నూడిల్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి.
అన్నీ ఇలాగే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి నూనె పోసి కాగనివ్వాలి. నూనె కాగాక.. ముందుగా తయారు చేసుకున్న సమోసాలను వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ నూడుల్స్ సమోసా రెడీ. వేడి వేడిగా వీటిని తింటే అదిరిపోతుంది. కాబట్టి, ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి.