కావాల్సిన పదార్థాలు:
రొయ్యలు - అర కిలో
బియ్యం - రెండు కప్పులు
కొబ్బరి తురుము - రెండు టీస్పూనులు
సాంబార్ పొడి - అర టీ స్పూన్
బంగాళాదుంప ముక్కలు - ఒక కప్పు
టొమాటో ముక్కలు - పావుకప్పు
ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
నెయ్యి - రెండు టీ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి - మూడు
పసుపు - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకచెంచా
కరివేపాకు - రెండు రెబ్బలు
కారం - ఒక టీ స్పూన్
నూనె - తగినంత
కొత్తిమీర తరుగు - ఒక కప్పు
తయారీ విధానం:
ముందుగా రొయ్యలను శుభ్రం చేసి పెట్టుకోవాలి. మరియు బియ్యాన్ని కూడా కడిగి అర గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రొయ్యలు, కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ కుక్కర్ పెట్టి అందులో కాస్త నెయ్యి వేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, టొమాటో, బంగాళాదుంపముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి తురుము వేసి వేయించాలి.
ఇవి బాగా వేగిన తర్వాత.. అందులో ముందుగా మారినేషన్ చేసిన రొయ్యలు కూడా వేయాలి. ఆ మిశ్రమాన్ని బాగా వేగించాలి. రొయ్యలు దాదాపు సగం ఉడికిపోవాలి. అలా సగం ఉడికిన తరువాత కడిగిన బియ్యాన్ని వేసి బాగా కలపాలి.
ఇప్పుడుఅందులోనే కొద్దిగా పసుపు, సాంబార్ పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం రెండు కప్పులు బియ్యానికి నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి కొత్తిమీర జల్లితే సరిపోతుంది. అంటే ఎంతో రుచికరమైన రొయ్యల కిచిడీ రెడీ. వేడి వేడిగా దీన్ని తింటే అదిరిపోతుంది. కాబట్టి, ఈ టేస్టీ రొయ్యల కిచిడీ మీరు కూడా తయారు చేసుకుని.. ఎంజాయ్ చేయండి.