కావాల్సిన పదార్థాలు:
బియ్యం - రెండు కప్పులు
బీట్రూట్ ముక్కలు - ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూన్
ధనియాల పొడి - ఒకటిన్నర టీ స్పూన్
గరం మసాలా పొడి - ఒక టీ స్పూన్
దాల్చిన చెక్క - ఒకటి
బిర్యానీ ఆకు - మూడు
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
పచ్చి మిర్చి - ఎనిమిది
పసుపు - ఒక టీ స్పూన్
నూనె - సరిపడినంత
పుదీనా తరుగు - అరకప్పు
కొత్తిమీర తరుగు - అరకప్పు
తయారీ విధానం:
ముందుగా నీటిలో బియ్యాన్ని కడిగి.. అరగంట పాటూ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె పోయాలి. నూనె వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి వేపాలి. అనంతరం అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి.
అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. రెండు నిమిషాల తర్వాత బీట్రూట్ ముక్కలు, పసుపు వేసి బాగా వేపాలి. బీట్రూట్ ముక్కలు సగం ఉడికి పోయేలా వేయించుకోవాలి. అలా ఉడికాక.. ధనియాల పొడి, గరం మసాలా పొడి మరియు సరిపడా ఉప్పు వేసి కలపాలి.
ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా బీట్రూట్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మూడున్నర కప్పుల నీళ్లు పోయాలి. అన్నం మెతుకు బాగా ఉడికేలా చూసుకోవాలి. అలా ఉడికాక.. చివరిగా కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.
అంతే ఎంతో రుచికరమైన, సులువైన బీట్రూట్ బిర్యానీ సిద్ధమైనట్టే. వేడి వేడిగా దీన్ని తింటే అదిరిపోతుంది. కాబట్టి, మీరు కూడా ఈ టేస్టీ బీట్రూట్ బిర్యానీని తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి.