సాధారణంగా ప్రతి మనిషి పుట్టుక నుంచి చావు వరకు దాదాపు అన్ని సందర్భంలోనూ ప్రేమ ఏదో ఒక రకంగా నేనున్నాను అని పలుకరిస్తూనే ఉంటుంది. ఈ రెండు అక్షరాల పదం ప్రేమ.. రెండు జీవితాల కలయిక పెండ్లి. ప్రేమతో మనస్సులు కలిస్తే.. పెండ్లితో అనుబంధం బలపడుతుంది. కానీ, ఈ ప్రేమ, పెండ్రి వల్లే ఒక్కోసారి ప్రాణాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఓ యువతి ప్రాణంకంటే ఎక్కువగా ఓ వ్యక్తిని ప్రేమించింది. ఆ తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్గా పెళ్లి కూడా చేసుకుంది.
అయితే ఈ విషయం తెలియని ఆమె తల్లిదండ్రులు ఆమెకు మరో వివాహం కుదిర్చారు. ఇది తెలిసిన ఆమె ప్రియుడు రచ్చ రచ్చ చేయడంతో.. సదరు యువతి అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ మండలం కుదరుమళ్ల గ్రామానికి చెందిన శైలేందర్, సరోజిని దంపతుల పెద్ద కుమార్తె స్రవంతి మహబూబ్నగర్లో బీఈడీ మొదటి సంవత్సరం చదువుతుండేది. స్రవంతి కుదురుమళ్ల గ్రామానికి చెందిన తిరుపతయ్యతో మూడేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం సీక్రెట్గా వివాహం చేసుకొని ఫొటోలు కూడా దిగారు. ఇక చదువు పేరుతో ఎవరికీ తెలియకుండా అతనితోనే ఉంటుంది స్రవంతి.
అయితే ఇటీవల లాక్డౌన్ విధించడంతో స్రవంతి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు కర్ణాటకకు చెందిన యువకుడితో ఈ నెల 30 వివాహం నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు.. పెళ్లికుమారుడి దగ్గరకు వెళ్లి విషయం చెప్పగా.. మొత్తం వ్యవహారం రచ్చ రచ్చ అయింది. దీంతో స్రవంతిని తల్లిదండ్రులు నిలదీయగా.. మనస్తాపం చెందిన ఆమె గురువారం తన ఇంట్లో పురుగుల మందు తాగింది. ఇది గమనించిన తల్లిదండ్రలు వెంటనే హాస్పటల్కు తీసుకువెళ్లారు. అయితే ఆమె హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు కేసు రాసి దర్యాప్తు చేపట్టారు. అలా స్రవంతి మూడేళ్ల ప్రేమ, అపై పెళ్లి విషాదాంతంగా ముగిసింది.